ఎప్పుడూ కన్యాశుల్కమేనా ?

2008 August 7
by అభిషేక్ చౌదరి
ఇంగ్లీషులో మల్లే తెలుగులో కూడా వెబ్ జైనులు రావడం చానా బావుంది. ‘మావోళ్ళు’ కూడా కొన్ని రన్ చేస్తా ఉన్నారు. మావోళ్ళ సైట్లు కూడా ఫ్రీ అంటే మొదట్లో నాకు చానా ఆశ్చర్యమేసింది. విషయం అది గాదు. మొదట్లో నేనీ వెబ్ జైనులు చదవడం మొదులెట్టినప్పుడు కన్యాశుల్కం గురించి ఓ వ్యాసంలో చదివాను. మళ్ళా ఆర్నెల్లు పోయినాక ఇంకో వెబ్ జైనులో కన్యాశుల్కం గురించి ఇంకో వ్యాసం చదివాను. మళ్ళా రీసెంటుగా అదే కన్యాశుల్కం మీద ఇంకోటి ఇంకో చోట. వేరే టాపిక్కు లేనట్టు ఏందబ్బా ఇది ?

కన్యాశుల్కం నాకేం కొత్త గాదు. ఆ మాటకొస్తే ఎవురికీ కాదనుకుంటా.  సంఘసంస్కరణ అనంగానే ఇంకేం లేనట్టు అదే రాస్తారేంది ? అని. మన రాష్ట్రంలో నిజంగా సంఘసంస్కర్తంటే కందుకూరి వీరేశలింగం పంతులుగారు. ఆడోళ్ళ బతుకుల్ని బాగుచెయ్యడం కోసం నిజంగా ప్రాణాలకి తెగించినోడాయన. సర్వస్వం ధారపోసినవాడాయన. ఆయన కూడా ఆ టాపిక్కు మీద చానా రాశాడని గ్నాపకం. వాటికేం పబ్లిసిటీ లేదు. అసలు ఆయనొకడున్నాడని కూడా జెనం మర్చిపొయ్యే పరిస్తితొచ్చింది. ఇదిట్లా ఉంటే - సంఘసంస్కరణ కోసం తన జీవితంలో నిజంగా ఏమీ చెయ్యని గురజాడ - విజియనగరం రాజావారి ప్రాపకం సంపాదించి మూడ్ బాలేనప్పుడల్లా ఊటీకి పోయి షికార్లు కొట్టిన గురజాడ - వట్టి గాలి కబుర్లు చెప్పి బతికిన గురజాడని ఇలా ఆకాసానికెత్తడం చూస్తా ఉంటే నాకు ఏదో మూల బాదగా ఉంది.

దీన్లో ఇంకోటుంది. ఒకడి పేరు ఇట్లా పైకి రాకుండా జేసి, ఇంకొకడి పేరు మాత్రం అమాంతంగా ఆకాసానికెత్తెయ్యడానికి జెనమేం పిచ్చినాకొడుకులు కారు. దీనికి యెనకమాల ఏదో బలమైన కారణం తప్పకండా ఉండితీరుద్ది. అదేందా ? అని చానా రోజులమట్టీ నా బుర్ర బద్దలు కొట్టుకున్నాక నాకొకటనిపించింది. తప్పుగా అనుకోకండి. ఆ క్షణంలో నాకట్లా అనిపించిందంతే ! పైకనకండా ఉండలేకపోతున్నా. 

ఇది తెలవక చేస్తున్నది గాదు. చెయ్యాలని చేస్తున్నదే. గురజాడని పైకెత్తేవోళ్ళెవరికీ బేసికల్ గా బ్రామ్మలంటే పడదు. అసలు విషయం అది. సంఘసంస్కరణ పేరు జెప్పి బేపనోళ్ళని తిట్టడానికి కన్యాశుల్కం ఓ మంచి అవకాసం. ఆ అవకాసం ఇచ్చినోడు గురజాడ. ఎందుకంటే కన్యాశుల్కంలో ఆయన చిత్రించిన  బ్రామ్మిన్ పాత్రలన్నీ పచ్చి లోఫర్, కిలాడీ, రోగ్, రాస్కెల్ పాత్రలే. వాస్తవానికి పూర్తి విరుద్ధంగా, అట్లాంటి పాత్రల్ని ఎందుకు సృష్టించాడో ఆ మహానుబావుడు, నాకు తెలవదు. నాకు తెలిసి మంచీ, చెడూ అన్ని కులాల్లోను ఉన్నై. ఆ రోజుల్లో కన్యాశుల్కం ఆచారం చేసుకున్న బేపనోళ్ళని తల్చుకుంటే నా మటుకు నాకు చెడ్డ బాదేస్తది. వాళ్ళు చెడ్డోళ్ళు కారు. పేదోళ్ళు మాత్రమే. పిల్లల్ని అమ్ముకునేంత పేదరికంతో బాదపడ్డ కులాన్ని చూసి జాలిపడ్డం మానేసి వాళ్ళని విలన్లని చేసి చిత్రించడం అమానుషం. ఆ ఆచారమైతే పోయింది గానీ వాళ్ళల్లో ఎక్కువమంది ఇప్పటికీ పేదోళ్ళే. కేవలం కథ కోసం పాపులారిటీ కోసం, హాస్యం కోసం ఒక పేద కులాన్ని బదనామ్ చెయ్యడం మంచిది కాదు. నీ కులపోళ్ళంతా ఎదవన్నర ఎదవలైతే వాళ్లల్లో పుట్టినోడివి నువ్వు మాత్రం మంచోడివెట్లా అవుతావు ? నీకెందుకు మేం పీటేసి సన్మానం చెయ్యాల ? అని గురజాడని అడగాలనిపిస్తది. వీరేశలింగం ఎప్పుడూ ఆ అవకాశం ఇవ్వలా. ఆయన సంఘసంస్కరణ సబ్జెక్టుకే కట్టుబడ్డాడు. కులప్రసక్తి తేలా. అందుకని ఆయన రచనలు పనికిరావు. అందుకని వీరేశలింగానికి పబ్లిసిటీ లేదు.

బేసికల్లీ పాపం, గురజాడ కూడా బేపనోడే. బేపనోడు కాబట్టే తన కులం గురించి మొహమాటం లేకుండా నిజాయితీగా రాశాడు. వేరే కులపోళ్ళు తమ కులంలో లోటుపాట్ల గురించి ఎప్పుడైనా అట్లా పబ్లిక్ డిస్కషన్ చేశారా ? తమ మీద తాము జోకులేసుకునే మంచిమనసు వేరే కులపోళ్ళకి ఎక్కడుంది ? మా కులంలో కట్నాలూ వగైరా చండాలాలు చానా పెద్ద లెవిల్లో ఉన్నాయి. ఎవడ్రాస్తున్నాడు వాటి గురించి ? అది బ్రామ్మలకే చెల్లు. కన్యాశుల్కం ఆ కులం అంతర్గత గొడవ. తమ కులాన్ని ఎట్లా బాగుచేసుకోవాలో బేపనోళ్ళు తమలో తాము ఒకప్పుడు చేసుకున్న డిస్కషన్ అది. దాని గురించి మనం (నాన్-బ్రామ్మిన్సు) ఎందుకు డిస్కస్ చెయ్యాల్నో నాకు తెలవదు. ఇప్పుడు ఈ కాలంలో కన్యాశుల్కమూ లేదు, గాడిదగుడ్డూ లేదు. ఆ టాపిక్ కి ఇప్పుడు రిలవెన్సే లేదు. ఇప్పుడు మనముందు చానా టాపిక్కులున్నై. అవి ఎవడూ రాయడు. ఇంగ్లీడులో అదేదో Intellectual bankruptcy అంటారే - దాంటో పడి అఘోరిస్తన్నాం. మనకి వేరే ఐడియాల్లేవ్. అందుకే ఇంకా కన్యాశుల్కమే మనకి మాస్టర్ పీసై కూర్చుంది.

నిజమూ, నీతీ, నిజాయితీ లేని దిక్కుమాలిన కులపిచ్చి కన్యాశుల్క సమీక్షలతో మమ్మల్ని సావగొట్టకండి బాబూ ! గురజాడలాంటి అరకొర సంస్కర్తల్ని వదిలిపెట్టి వీరేశలింగంలాంటి నిజమైన సంస్కర్తలకి పబ్లిసిటీ ఇవ్వండి మహాప్రభో !   

8 Responses leave one →
  1. 2008 August 7

    చాలా సాధికారమైన అక్కసు వెళ్ళగక్కారు.”ఎంతఎక్కువ మడిగట్టుకునుంటే, అంతెక్కువ సంస్క్రరణకు వీలు” అని చెబుతుంటారు. అందుకే, బ్రాహ్మణ రచయితలందరూ,గురజాడ నుంచీ చలందాకా కులాన్ని పీకిపాతరేసారు. అది సహజంకూడానూ! ఇక దాని గురించి తెగరాయడమంటారా,మిగతా సాహిత్యం అలా ఏడిస్తే రాయడానికి ఇదేమిగిలిందాయె.మన ఖర్మ ప్రారబ్ధం.

  2. 2008 August 7
    Anonymous permalink

    వాబ్బో!చానుందే యవారం,ఇట్టా అడావుడిగా కాదులే గానికాస్తాగి వస్తా

    రాజేంద్ర కుమార్ దేవరపల్లి

  3. 2008 August 7
    Anonymous permalink

    kulanv kulanv kulanv.. idi thappa vere anvsanve ledha ra babu telugu lon? cchatth!
    - rakeshvara (peru badudlu kulanv raayalemo ilanti chota. )

  4. 2008 August 7

    చిన్న వ్యాసంలో చాలా విషయాలు కదిలించారు. కన్యాశుల్కం విషయంలో వీరేశలింగం కూడా వ్రాశారు. ఆ విషయాన్ని గురజాడ కన్యాశుల్కంలో ప్రస్తావించారు కూడా. కాకపోతే వీరేశలింగంగారిని సంఘసంస్కర్తగానే చూస్తారు కాని రచయతగా కాదు. ఎందుకంటే ఈ విషయం మీద ఆయన రచన సాహిత్యపరంగా అంత గొప్పదేమి కాదనుకుంటా. దురాచారాలను రూపు మాపాలనుకున్నఫ్ఫుడు దాని మీద దండెత్తటం కన్నా దాని గురించిన awareness జనాల్లో కలిగించటం ముఖ్యం. ఆ పని చెయ్యటంలో సాహిత్యం పాత్ర పెద్దది. అది లేనప్పుడు మనం ఎంత ఘాటైన పదాలతో విమర్శించినా శత్రువులు తయారవ్వటం తప్ప పెద్ద ప్రయోజనం లేదు. గురజాడ కన్యాశుల్కం ఆ రకమైన కదలిక తీసుకువచ్చింది. ఎవరో చెప్పినట్లు వీరేశలింగం కన్యాశుల్కం తీసుకునే వారి మీద కత్తి దూస్తే, గురజాడ వారిని నవ్వులపాలు చేసాడు. ఇందులో దేని ప్రయోజనం దానికున్నాయి. ప్రత్యక్షంగా పోరాడి ప్రతిఘటించే సంస్కర్తలు, సాహిత్యం ద్వారా ఆ సమస్యను జనంలోకి తీసుకెళ్ళి వారి ఆలోచనను ప్రభావితం చేసే రచయితలు, ఇద్దరూ లేకపోతే ఏరకమైన సంస్కరణా సాధ్యం కాదు. ఇప్పటికి సంస్కర్తల గురించి వచ్చినప్పుడు వీరేశలింగం గారినే తలుస్తారు, కానీ సాహిత్య పరంగా చూసినప్పుడు గురజాడని తలుచుకోకుండా ఉండలేం. పైగా కన్యాశుల్కం రచన ఆ ఒక్క దురాచారం గురించే కాక అప్పటి సమాజపు పోకడలను పట్టి చూపిస్తుంది. ఇంగ్లీషు చదువులపై మోజు, విధవల సమస్య, వేశ్యా సమస్య, యాంటీ నాచులమని చెప్పుకుని సానికొంపల్లో దూరే ఆషాడభూతుల గురించి, కోర్టు వ్యవహారాలు, ఇలా ఎన్నో. ఇన్ని విషయాలను అలవోకగా కలిపి హస్యపు పూత పూసిన రచన అది. అదీ కాక మొదటిసారి వ్యవహారిక భాష వాడి రాసిన నాటకం. ఒకే నాటకంతో అటు వీరేశలింగం గారి సంస్కరణోద్యమానికి, ఇటు గిడుగువారి వ్యవహారికి భాషోద్యమానికి, ఇంకో వైపు తెలుగు నాటక రంగానికి ఊతమిచ్చిన రచన కన్యాశుల్కం. ఈ కారణాలు చాలవా దాని కీర్తికి, దాని వల్ల ఆయన కీర్తికి. కన్యాశుల్కం అనేది ఒక్క అవుడేటడ్ దురాచారం గురించిన రచనే అయితే దాన్ని గురించి మనం ఇప్పుడు పెద్దగా తలుచుకోనక్కర లేదు. కానీ అది అంతకంటే ఎక్కువ. దానిలోని పాత్రలు కొన్ని మనకు ఇప్పటికీ కనపడతాయి. అందుకే అది ఇప్పటికి రిలవెంట్.

    ఒక కులంలో వుండే దురాచారాం గురించి ఆ కులం వాళ్ళు చెబితేనే పొలిటికల్గా కరెక్ట్ అవుతుంది గాని, వేరే కులం వాళ్ళు చెప్తే గొడవలైపోవూ. మీ కులంలో దురాచారాల గురించి చెప్పారు. దాన్ని మీరు విమర్శిస్తే వూరుకుంటారు గానీ, వేరే కులం వాళ్ళు ఎత్తిచూపితే వూరుకుంటారా? అలాగే గురజాడ తన కులంలోని దురాచారం గురించి బాధపడి తనకు చేతనైన దారిలో సంస్కరణకు పూనుకున్నాడు. తప్పేముంది. పేద కులమైనా, పెద్ద కులమైనా దురాచారం అనేదాన్ని సంస్కరించక తప్పదు. అందుకు ఆయన ఎంచుకున్న దారి సెటైర్. ఎత్తిచూపకుండా సంస్కరించటం ఎలా? మనమూ మన కులాల్లో వున్న చెడును మనకు చేతనైన రీతిలో సంస్కరించుకుందాం.

    కామెంట్ కొంచం పెద్దదైనట్లుంది. సారీ

  5. 2008 August 7

    @ మహేష్ - అక్కసుక్కూడా సాధికారత కావాలా? చాలా అలవోకగా కక్కెయ్యొచ్చనుకున్నానే? :)
    @ అభిషేక్ - సరదాగా ఉంది మీర్రాసింది చదవడం, కానీ ఇక్కడ మీరు ప్రస్తావించిన చాలా విషయాల్లో మీ అవగాహన తప్పు అని నాకనిపిస్తోంది. వాటిల్లో కొన్ని:
    1. నిజంగా కన్యాశుల్కం పుచ్చుకున్నవాళ్ళు బీదోళ్ళొ కాదో నాకు తెలీదు, కానీ కన్యాశుల్కం నాటకంలో పుచ్చుకునేవారు మాత్రం బీదవాళ్ళు కాదు. వాళ్ళకి డబ్బు అవసరాలు ఉంటాయి (ఎవరికి ఉండవు?) కానీ అవి కూడూ గుడ్డా లాంటి అవసరాలు కావు.
    2. గురజాడ తాను సంఘసంస్కర్తని అని ఎక్కడా తన రచనల్లో చెప్పుకోలేదు. అసలు కన్యాశుల్కం నాటకం సంస్కరణ కోసం రాసింది కాదని ఇటీవల ఆచార్య వెల్చేరుగారు ఒక సిద్ధాంతం ప్రతిపాదించారు. దాన్ని వారి మాటల్లోనే Girls For Sale అనే పుస్తకంలో చదవొచ్చు.
    3. వీరేశలింగం గారు చేపట్టి అమలు పరిచిన అనేక సంఘసంస్కరణ కార్యక్రమాల గురించి, ఆయన ఇతర కార్యకలాపాల గురించీ, గురజాడకి కొంత గౌరవంతో కూడిన చులకన బ్హావం ఉంది. ఇది పేరడాక్సులాగా అనిపించొచ్చు గానీ నిజం.
    4. కన్యాశుల్కం నాటకమూ, గురజాడ ఇతర రచనలూ, అసలు గురజాడ పేరూ సంస్కరణోద్యమ నినాదాలకి ఎలా తూనిక రాళ్ళయినాయి అనేది ఒక వింత. దీనిమీద ఒక history-sociological-political PhD చెయ్యొచ్చు.
    5. బ్రాహ్మణులందరూ ఒకటి గాదు. కన్యాశుల్కం నాటకంలోనే వైదీకులకీ నియోగులకీ ఉన్న తేడాలని తెరకట్టినట్టు చూపించాడు గురజాడ. తాను నియోగి కాబట్టి వైదీకుల్ని యద్దేవా చేశాడనీ, వాళ్ళ ఆచారమైన కన్యాశుల్కాన్ని ఖండించాడనీ అనుకునేందుకు కూడా వీల్లేదు. నాటకంలో నియోగి బ్రాహ్మలైన రామప్పంతులూ, సౌజన్యారావు పంతుళ్ళని కూడా వెధ్వల్ని చేశాడు. నాటకంలో తెలివైన ఉదాత్తమైఅన్ పాత్ర అంటూ ఉంటే అది ఒక్క మధురవాణి మాత్రమే!
    6. మీరు (మహేష్ కూడా) కన్యాశుల్కం నాటకాన్ని ఒక రచనగా, ఒక కావ్యంగా చాలా తక్కువ అంచనా వేశారు. ఈ సంస్కరణ అనే ఆలోచన పక్కన బెట్టి కావ్యాస్వాదన కోసం మళ్ళీ చదవండి.

    @రాకేశ్వర - కులం మాట ఎత్తితే అంత కంపరం ఎందుకు? అదికూడా ఒక అంశం .. అంతే

  6. 2008 August 8
    Anonymous permalink

    ” ఇప్పటికి సంస్కర్తల గురించి వచ్చినప్పుడు వీరేశలింగం గారినే తలుస్తారు, కానీ సాహిత్య పరంగా చూసినప్పుడు గురజాడని తలుచుకోకుండా ఉండలేం.”

    అనానిమసు గారూ ! ఈ ఒక్కమాటతో నేను రాసింది నిజమని మీరు నిరూపించేశారు. కులద్వేషంతో ఎట్లా గురజాడని అనవసరంగా ఎత్తేసి వీరేశలింగాన్ని పక్కని పెట్టేశారో, ఆయన గొప్పతనం తెలుసుకోకుండా అన్ని గొప్పతనాల్ని (ఆచరణలో ఏమీ చెయ్యని) గురజాడకే ఎట్లా అంటగట్టేశారో దీని మూలంగా అర్థమౌతాంది.

    సాహిత్యంలో కూడా వీరేశలింగంగారితో పోలిస్తే గురజాడ ఓ మరుగుజ్జు. వీరేశలింగంగారు శతాధిక గ్రంథకర్త అనే విషయం మీకు తెలుసా ? తెలవదు. మీకే కాదు. సోమరిపోతు గురజాడని ఆకాసానికెత్తేవాళ్ళెవురికీ వీరేశలింగం గారి గొప్పతనం తెలవదు. తెలుసుకోడం ఇస్టం లేదు కనక. తమ కులద్వేష అజెండాలో వీరేశలింగం ఇమడడు కనక, గురజాడ భేషుగ్గా ఇమడతాడు కనక.

    వీరేశలింగం తెలుగు సాహిత్యంలో చానా ప్రక్రియలకు ఆద్యుడని మీకు తెలుసా ? ఆయన మొదటి నవలా రచయిత. మొదటి నాటక రచయిత. మొదటి సాహిత్య చరిత్రకారుడు. ఆయనతో పోలిస్తే గురజాడలో రాశి, వాసీ రెండూ తక్కువే.

    కొత్తపాళీగారూ ! కన్యాశుల్కంలో ఆడపిల్లల్ని అమ్ముకున్నోళ్ళు లేనోళ్ళు కారు కాబట్టి వాస్తవ జీవితంలో కూడా ఆడపిల్లల్ని అమ్ముకున్నోళ్ళు లేనోళ్ళయి ఉండరు. ఇదేనా మీ వాదం ? అంటే అప్పటి పరిస్థితుల్ని గురించి గురజాడ రాసింది మాత్రమే మనం నమ్మాలా ? మనం సొంతంగా ఆలోచించేదేమీ లేదా ? ఆడపిల్లల్ని ముసిలోళ్ళకి అమ్ముకోమని ఏ శాస్త్రంలోనూ రాసి లేదు. కాని కొంతమంది (అందులోను 19 శతాబ్దంలోనే, మళ్ళా అంతకుముందు కాదు) అట్లా చేశారు అంటే దానికి ఆర్థిక కారణాలున్నై అని ఊహించలేనంత అమాయకులా మీరు ?

    నేను ఆలోచించకుండా ఏ స్టేట్ మెంటూ ఇవ్వనండీ ! అది గుర్తించండి.

  7. 2008 August 8

    అభిషేక్ గారు, నేను అనానిమస్సును కానండి. క్లియర్గా నా పేరుతోనే రాసాను.

    ” ఇప్పటికి సంస్కర్తల గురించి వచ్చినప్పుడు వీరేశలింగం గారినే తలుస్తారు, కానీ సాహిత్య పరంగా చూసినప్పుడు గురజాడని తలుచుకోకుండా ఉండలేం.” - నా ఈ వాఖ్య కులద్వేషాన్ని నిరూపించేదెలగయ్యిందో అర్థం కావట్లేదు. సాహిత్యపరంగా చూసినప్పుడు గురజాడని తలుచుకోకుండా వుండలేమన్నానే కానీ, ఆయన వీరేశలింగంగారి కంటే గొప్పవారని కాదు.

    వీరేశలింగంగారు శతాధిక గ్రంధకర్త కావచ్చు, ఆయనతో పోలిస్తే గురజాడ రాసింది బహు తక్కువ కావచ్చు. ఆయన ఎన్నో విషయాల్లో మొదటి వారు కావచ్చు. ఆయన గొప్పదనాన్ని ఎవరూ కాదనట్లేదు. కానీ కన్యాశుల్కం అనేదాన్ని జనంలోకి తీసుకెళ్ళే విషయంలో వీరేశలింగంగారి రచన కన్నా గురజాడ రచన ఎక్కువ ప్రయోజనాన్ని సాధించిందని భావిస్తాను. వీరేశలింగంగారి కన్యాశుల్కం ఆ దురాచారాన్ని ఘాటైన పదాలతో విమర్శించే వ్యాసమైతే, గురజాడవారి కన్యాశుల్కం జనరంజకమైన నాటకం. ఎన్నో వందలసార్లు ప్రదర్సించబడి సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వ్యవహారిక భాషలో వున్న నాటకం. అదే ఆయనకి పేరు తెచ్చింది కానీ ఆయన బ్రాహ్మణ వ్యతిరేకి అని కాదు.

    నిజానికి కన్యాశుల్కం, బాల్య వివాహలు లాంటివి మిగతా కులాల్లో కూడా వున్నాయని ప్రస్తావించాడు. కన్యాశుల్కంలో ఆయన చర్చించిన మిగతా ట్రెండ్స్ అన్ని కులాల్లోనూ వున్నవే. గిరీశంలాంటి పాత్రలు ఇప్పటికి మిగతా కులాల్లో కనపడతాయి. కాబట్టే అవి ఇప్పటికి సజీవంగా అనిపిస్తాయి. కన్యాశుల్కం అంతరించిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత చదివినా ఆ పాత్రల్ని మనం ఇప్పటి సమాజంలో ఎక్కడో అక్కడ పోల్చుకోగలం కాబట్టే ఆ నాటిక ఇంకా బ్రతికి ఉంది. అలాంటి సజీవ పాత్రలు సృష్టించాడు కాబట్టే ఇంకా గురజాడని తలుచుకుంటున్నాం. వీరేశలింగంగారి శతాధిక రచనల్లో ఇలాంటి జన రంజకమైనది, విభిన్నమైన పార్శాలు కలిగినది, విభిన్నమైన సమస్యల్ని పట్టి చూపించినది లేదనే అనుకుంటాను. ఒకవేళ వుంటే అందుకు కారణం నేను (లేక నాలాంటి వారు) చదవలేకపోవటమే తప్ప, అందులో బ్రాహ్మణ ద్వేషం లేదని మనవి. ఆయన అన్ని రచనలు చదవలేకపోటానికి ఆయన రచనల్లోని ప్రౌడ భాష, క్లిష్టమైన వ్యాకరణమే కారణం కానీ మరోటి కాదు. గురజాడ జనానికి ఎక్కువ తెలియటానికి ఆయన నాటకానికి వాడిన వ్యవహారిక భాష ఒక కారణం. సాహిత్యపరంగా ఎన్నింటికో ఆద్యుడైనా వీరేశలింగంగారు మరుగునపడటానికి, గురజాడ వెలిగిపోవటానికి, ఆ తర్వాత ఉవ్వెత్తున లేచి నిలిచిపోయిన వ్యవహారిక భాషోద్యమం ఒక కారణం అనుకుంటాను.

    ఆదికవి నన్నయ కంటే మనం తిక్కనను ఎక్కువగా తలుచుకుంటాం. ఎందుకంటే ఆదికవి అయినా నన్నయ భాష సంస్కృత సమాస భూయిష్టం. ఆయన రచనలోని గొప్పతనం గొప్ప పండితులకు తప్ప అంతకు తక్కువైన వారికి అర్థమవ్వటం కష్టం. తిక్కన జానుతెలుగులో రాయటానికి ప్రయత్నించిన వాడు, సంస్కృతంలోని బిగువుని, తెలుగులోని తీపిని కలిపి రంగరించినవాడు. తిక్కనను పోగిడినంత మాత్రాన తొలి ప్రయత్నం చేసిన ఆదికవిగా నన్నయ గొప్పతనం తగ్గించినట్టా? కాదే.

    గురజాడ ఒకచోట కూర్చుని రచనలు చేసినవాడే కాని జనంలోకి వచ్చి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన వాడు కాదు. సంస్కర్తల గురించి మాట్లాడినప్పుడు వీరేశలింగంగారితో కనీసం పోల్చదగ్గ వ్యక్తి కూడా కాదు. కానీ రచయతల గురించి మాట్లాడేటప్పుడు, ఆయన రాసినవి తక్కువైనా, శతాధిక గ్రంధకర్త అయిన వీరేశలింగంగారి కంటే తక్కువ చేయలేము.

  8. 2009 March 16

    particularly good at. Great news, nonetheless.

Leave a Reply

Note: You can use basic XHTML in your comments. Your email address will never be published.

Subscribe to this comment feed via RSS